ఆ రక్త తర్పణం సర్వమానవాళికి నిత్య జీవము
కరుణాపురం విచారణ గురువు ఫాదర్ సుధాకర్ రెడ్డి
భక్తి శ్రద్దలతో గుడ్ ఫ్రైడే వేడుకలు
-పెద్ద ఎత్తున పాల్గొన్న క్రైస్తవ భక్తులు
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
మండలంలోని కరుణాపురంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో సాగాయి. ఫాదర్ సుధాకర్ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల్లో సిలువ మార్గ ప్రదర్శన, ప్రత్యేక ప్రార్థనలు గ్రామాన్ని ఆధ్యాత్మిక చైతన్యంలో ముంచెత్తాయి.
ఈ సందర్భంగా గ్రామ వీధుల్లో సిలువ మార్గ ప్రదర్శన అట్టహాసంగా నిర్వహించబడింది. యేసు ప్రభుగా గాదె తరుణ్ పాత్రధారణ చేసి, క్రీస్తు త్యాగాన్ని ప్రతిబింబించేట్టుగా తన జీవావేగ నటనతో సాటి ప్రజల మనసులను తాకాడు. అనంతరం హోలీ ల్యాండ్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా ఫాదర్ సుధాకర్ ప్రసంగిస్తూ, ‘‘ఈ రోజు ప్రభువు శిలువ వేసిన రోజు మాత్రమే కాదు… ప్రతి మనిషి తన అంతర్మనంలోకి వెళ్లి, ‘నేను నా జీవితాన్ని ఏ దిశగా నడుపుతున్నాను?’ అనే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సందర్భం. ప్రేమ, క్షమ, సేవ లేని జీవితం శూన్యం’’ అని పేర్కొన్నారు.
అలాగే, ‘‘యేసు ప్రభువు శిలువను మోసిన మార్గం మనకూ మార్గదర్శనం. మన మాటల్లో ప్రేమ ఉండాలి, మన చేతల్లో సేవ ఉండాలి. ఈ రోజున క్రీస్తు మనల్ని ప్రశ్నిస్తున్నాడు.నీ జీవిత ప్రయాణంలో నీవు ఎంతమాత్రం మానవత్వాన్ని అనుసరిస్తున్నావు?’’ అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో క్రైస్తవులు, సంఘస్తులు, ఫాదర్లు, సిస్టర్లు,క్రెస్తవ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments