కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదు
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ సింగపురం ఇందిర
స్టేషన్ ఘనపూర్,తెలంగాణ ముచ్చట్లు:
కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలను వేధించే ప్రయత్నాలు ఏవైనా జరిగితే సహించేది లేదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, స్టేషన్గంపూర్ నియోజకవర్గ ఇన్చార్జి సింగపురం ఇందిర స్పష్టం చేశారు.
రఘునాథపల్లి మండల కేంద్రంలో అన్ని మండలాలకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మూడుసార్లు కాంగ్రెస్ జెండా మోసిన కట్టుబట్టిన కార్యకర్తలు ఇప్పుడు అనేక అవమానాలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుండి పార్టీ మారిన కొందరు గ్రామాల్లో నిబద్ధత గల కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇది సహించదగిన అంశం కాదన్నారు.
కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదని, వారి వెంటే పార్టీ మొత్తం నిలబెడుతుందని ఆమె భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులపై ఏవైనా దురుద్దేశపూరిత చర్యలు జరిగితే కఠినంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీని విడిచిపోయిన నేతల వల్ల కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారని, వారి సంక్షేమాన్ని విస్మరించిన వారు ప్రజల్లో నిలదొక్కుకోలేరని విమర్శించారు.
పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసి కాంగ్రెస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయాలనే ప్రయత్నాలు జరిగితే, సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకునేలా చూస్తామని స్పష్టంగా హెచ్చరించారు. ప్రభుత్వంలో ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేసి కార్యకర్తలను వేధించే ఏ నాయకుడైనా భవిష్యత్తులో అదే పరిస్థితిని ఎదుర్కొవాల్సి వస్తుందని సింగపురం ఇందిర హెచ్చరించారు.
Comments