ఈ నెల 16న స్టేషన్ ఘనపూర్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం
-స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ లాంచనంగా ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
-నియోజకవర్గకేంద్రంలో 50వేల మందితో భారీ బహిరంగ సభ
-అభివృద్ధి పనుల కోసం నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి రాలేదు
-ప్రతిపక్ష నాయకులు చౌకబారు విమర్శలు చేస్తున్నారు
-పని లేనివారితో పెట్టుకొని నా సమయం వృధా చేసుకోను
-నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలి
-నియోజకవర్గంలో మన బలం ఏంటో నిరూపించాలి
-ఈ నెల 16న జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలి
స్టేషన్ ఘనపూర్,తెలంగాణ ముచ్చట్లు:
ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే సమయం ఆసన్నమైందని.... ఈ నెల 16న దాదాపు 800 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం నియోజకవర్గ ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే కడియం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో నాయకులకు పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. నియోజకవర్గ పరిధిలోని 7మండలాల మండల కమిటీలకు, మండల సమన్వయ కమిటీలకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. మార్చి 16న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి మంజూరు అయిన 800కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొంటారని అన్నారు. ఆయా మండలాల ముఖ్య నాయకులు మార్చి 7,8,9,10,11తేదీలలో మండల ముఖ్య నాయకులు మండలంలోని అన్ని గ్రామాలలో పర్యటించాలని తెలిపారు. ప్రతీ గ్రామంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించి గ్రామ సమస్యలపైన, అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన విషయాలపైన చర్చించాలని సూచించారు. అలాగే నియోజకవర్గంలో మరియు మండలంలో మంజూరు అయిన అభివృద్ధి పనులను కార్యకర్తలకు వివరంగా చెప్పాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను వివరించాలని అన్నారు. గ్రామంలో పాత, కొత్త అనే బేధం లేకుండా అందరిని సమన్వయం చేయాలని తెలిపారు. ప్రతీ గ్రామంలో 15మందికి తగ్గకుండా యువజన, మహిళా కాంగ్రెస్ కమిటీలను అలాగే 5మందికి తగ్గకుండా సోషల్ మీడియా కమిటీలను ఏర్పాటు చేయాలని ఈ కమిటీల ఏర్పాటులో అందరికీ అవకాశం కల్పించే విధంగా చూడాలని సూచించారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభకు 50వేల మందికి తగ్గకుండా జన సమీకరణ చేయాలని పిలుపునిచ్చారు. గ్రామంలో ఒక్కో బూత్ నుండి 150కి తగ్గకుండా జన సమీకరణ చేయాలని తెలిపారు. ఒక్కో బూత్ కు ఇద్దరు లేదా ముగ్గురు ఇంచార్జ్ లను నియమించాలని, జన సమీకరణ, వాహనాల ఏర్పాటు బాధ్యత ఇంచార్జ్ లదే అని స్పష్టం చేశారు. మళ్ళీ మార్చి 12,13తేదీలలో మండలాల వారీగా ఆయా మండల కేంద్రాలలో సమీక్షా సమావేశాలు ఉంటాయని పేర్కొన్నారు.
మండల పార్టీ అధ్యక్షులు గ్రామాల పర్యటన వివరాలను రేపు సాయంత్రం లోగ అందించాలని, ఆ షెడ్యూల్ ప్రకారమే ఆయా గ్రామాలకు ముందుగా సమాచారం అందించాలని సూచించారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలం ఏంటో చూపించాలని పిలుపునిచ్చారు. గ్రామాల నుండి కేవలం కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే తీసుకురావాలని వెల్లడించారు. గ్రామం నుండి వచ్చే వారితో సమన్వయం చేసుకుంటూ సభలో ఇబ్బంది ఉండకుండా చూసుకోవాలని సూచించారు. అందరం కలిసి పార్టీ కోసం కష్టపడదామని, పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి సీఎం రేవంత్ రెడ్డి బ్రహ్మరథం పట్టి ముఖ్యమంత్రిని సంతోష పెట్టాలని కోరారు.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి మంజూరు అయిన 100పడకల అస్పత్రి, డివిజనల్ ఆఫీస్ కాంప్లెక్స్, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, డిగ్రీ కాలేజ్, ఘనపూర్ నుండి నవాబ్ పేట కెనాల్ సిసి లైనింగ్, పంచాయతీ రాజ్ రోడ్లు, 3సబ్ స్టేషన్లు, డీఈ ఆఫీస్, బంజారా భవన్ తో పాటు జనవరి 26న 4నాలుగు సంక్షేమ పథకాలను మండలానికి ఒక గ్రామంలో ప్రారంభించిన గ్రామాలకు మంజూరు అయిన ఇందిరమ్మ ఇళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు. ఈ సందర్బంగా సీఎం ని నియోజకవర్గ అభివృద్ధికి ఎక్కువ నిధులు కోరడం జరుగుతుందని తెలిపారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి పర్యటించలేదని అన్నారు. మొట్ట మొదటి సారిగా నియోజకవర్గానికి వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బహిరంగ సభ ద్వారా ఘన స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు.
ప్రతిపక్ష నాయకులు చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ లబ్ది కోసం ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని అన్నారు. పని లేని వారితో పెట్టుకొని నా సమయాన్ని వృధా చేసుకొనని, నా ఎజెండా కేవలం నియోజకవర్గ అభివృద్ధి మాత్రమేనని స్పష్టం చేశారు. దేవాదుల ప్రాజెక్టుతో సాధ్యమైనంత వరకు సాగు నీరు అందిస్తున్నానని తెలిపారు. జీడికల్ వరకు గోదావరి జలాలు తీసుకురాగలిగాని పసలేని మాటలు మాట్లాడే వారు ఒకసారి జీడికల్ వెళ్లి చూడాలని హితవుపలికారు. ప్రతీ ఒక్కరూ సహకరించి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comments