జనక్ ప్రసాద్పై బీఎంఎస్ ఆరోపణలను ఖండించిన ఐఎన్టీయూసీ
సత్తుపల్లి,తెలంగాణ ముచ్చట్లు:
బీఎంఎస్ నాయకులు జనక్ ప్రసాద్పై చేసిన ఆరోపణలను ఖండిస్తూ ఐఎన్టీయూసీ కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్ స్పందించారు. శుక్రవారం సత్తుపల్లిలో జరిగిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తున్న జనక్ ప్రసాద్పై అసత్య ఆరోపణలు మానుకోవాలి” అని బీఎంఎస్ నాయకులకు సూచించారు.
ఫిబ్రవరి 12న జరిగిన ఏబీకేఎంఎస్ సమావేశంలో కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో సీఏంపీఎఫ్ నిధుల అవకతవకలపై బీఎంఎస్ లక్ష్మారెడ్డి చేసిన ఆరోపణలను గుర్తు చేస్తూ, “ఈ వ్యవహారంపై 2019 నుండి బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఇప్పటివరకు సీబీఐ దర్యాప్తు ఎందుకు జరపలేదు?” అని రజాక్ ప్రశ్నించారు.
తెలంగాణ ప్రభుత్వం సింగరేణికి బకాయిల గురించి మాట్లాడే ముందు, అది గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినది అని తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనాల పెంపు కోసం జనక్ ప్రసాద్ తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి ఛైర్మన్గా అనిర్విచ్ఛిన్నంగా కృషి చేస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని 1.25 కోట్ల మంది కార్మికుల వేతనాలు పెరుగనున్నట్లు వెల్లడించారు.
సింగరేణిలో లాభాల వాటా నుంచి రూ. 5,000 కాంట్రాక్ట్ కార్మికులకు అందజేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వానిదే ఘనత అని గుర్తుచేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు తర్వాత కార్మికుల కోసం అనేక హామీలు నెరవేరుస్తున్నామని, కోటి రూపాయల ప్రమాద బీమా, నూతన బొగ్గు గనుల ప్రారంభం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు, కొత్త నియామకాలు, పెండింగ్ వయోపరిమితి పెంపు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, బీసీ లైసెన్స్ ఆఫీసర్ నియామకం, కాంట్రాక్ట్ కార్మికుల 40 లక్షల ప్రమాద బీమా తదితర అంశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
త్వరలోనే కార్మికుల సొంతింటి కల, పెర్క్స్పై ఆదాయపన్ను మాఫీ హామీలు నెరవేర్చేందుకు ఐఎన్టీయూసీ జాతీయ నాయకత్వం కృషి చేస్తుందని రజాక్ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు గౌస్, చెన్నకేశవరావు, తీగల క్రాంతి కుమార్, సీతారామరాజు, రామారావు, బాలాజీ, నాగేశ్వరరావు, కోటి, సురేష్, ఐవి రెడ్డి, చాంద్, రఫీ, రామచందర్, యాకూబ్, మోహన్, మురళి, నాగేందర్, శ్రీధర్, బాలకృష్ణ, రాము, ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments